ఐదు ప్రధానాంశాలతో కాంగ్రెస్ మేనిఫెస్టో

కాంగ్రెస్ మేనిఫెస్టో వచ్చేసింది. ఢిల్లీ జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ మేనిఫెస్టోని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విడుదల చేశారు. దీన్ని గదిలో కూర్చుని రూపొందించలేదని, ప్రజల మనసులో ఆలోచన ప్రతిబింబించేలా రూపకల్పన చేశామని రాహుల్ చెప్పారు. ఐదు ప్రధానాంశాలతో కాంగ్రెస్ మేనిఫెస్టోని రెడీ చేసింది.

1. న్యాయ్‌ పథకం ద్వారా ఏడాదికి రూ.72వేలు చొప్పున పేదలకు అందిస్తాం. ఈ పథకం రెండు రకాలుగా పనిచేస్తుంది. మొదటగా ఇది పేదల జేబుల్లో డబ్బులు నింపుతుంది. రెండోది నోట్ల రద్దుతో దెబ్బతిన్న దేశ ఆర్థికపరిస్థితిని మెరుగుపరుస్తుంది.

2. ప్రస్తుతం ఖాళీ ఉన్న 22 లక్షల పోస్టులను భర్తీ చేస్తాం. పంచాయతీల్లో 10 లక్షల ఉద్యోగాలను పూరిస్తాం. కొత్తగా వ్యాపారం చేసుకునేవారికి తొలి మూడేళ్ల పాటు ఎలాంటి అనుమతులూ అవసరం లేకుండా చేస్తాం. గ్రామీణ ఉపాధి హామీని పటిష్ఠం చేస్తాం. ఇప్పుడున్న పని దినాలను 100 నుంచి 150కి పెంచుతాం.

3. రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్‌ను తీసుకొస్తాం. రుణాలు చెల్లించలేని రైతులపై పెట్టే కేసులను క్రిమినల్‌ కేసులుగా పరిగణించం.

4. విద్యపై జీడీపీలో 6 శాతం ఖర్చు చేస్తాం.

5. జాతీయ, అంతర్గత భద్రతకు పెద్దపీట వేస్తాం.

వీటితో పాటుగా..

* అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా

* అధికారంలోకి రాగానే రఫేల్‌ ఒప్పందం మీద విచారణ

* వివిధ బ్యాంకుల్లో రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వారిపై సమగ్ర విచారణ అంశాలని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్నారు