మోహన్ బాబుకి యేడాది జైలు శిక్ష.. ఎందుకంటే ?


డైలాగ్ కింగ్ మోహన్ బాబుకు పొలిటికల్ రీ-ఎంట్రీ కలిసొచ్చినట్టు లేదు. ఆయన ఇటీవలే వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. వైసీపీలో చేరి కనీసం పది రోజులు కూడా గడవక ముందే ఆయనకు యేడాది జైలు శిక్షపడింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌ కోర్టు తీర్పునిచ్చింది. ఇది ‘సలీ’ సినిమాకు సంబంధించిన చెక్ బౌన్స్‌ కేసు. వైవీఎస్‌ చౌదరి దర్శకత్వంలో ‘సలీం’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ సందర్భంగా రూ.40.50లక్షల చెక్కును మోహన్‌బాబు దర్శకుడికి అందించారు. అయితే, ఆ చెక్‌ నగదుగా మారకపోవడంతో వైవీఎస్‌ చౌదరి 2010లో కోర్టును ఆశ్రయించారు.

అప్పటి నుంచి విచారణ జరుగుతుండగా, దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మంగళవారం తుది తీర్పు వెలువడింది. ఇందులో ఎ1గా ఉన్న లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌కు రూ.10వేల జరిమానా, ఏ2గా ఉన్న మోహన్‌బాబుకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.41,75,000 చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి మోహన్‌బాబు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. రూ.40.లక్షలు చెల్లించేందుకు సమ్మతి తెలపడంతో న్యాయమూర్తి బెయిల్‌ మంజూరు చేశారు.