గంగూలీపై అభిమానుల ఫిర్యాదు

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ ఐపీఎల్‌ జట్టు దిల్లీకి సలహాదారుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. క్యాబ్‌ పదవిలో ఉంటూ ఐపీఎల్‌ జట్టుకు సలహాదారుగా వ్యవహరించడం విరుద్ధ ప్రయోజనాల కిందికి వస్తుందంటూ గంగూలీపై ముగ్గురు క్రికెట్‌ అభిమానులు ఫిర్యాదు చేశారు. ఏప్రిల్‌ 12న కోల్‌కతాలో నైట్‌రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌ సందర్భంగా పిచ్‌ను దిల్లీకి అనుకూలంగా తయారు చేయిస్తే, మరో రకంగానైనా గంగూలీ ఆ జట్టుకు సాయపడటానికి ప్రయత్నిస్తే ఏంటి పరిస్థితి అన్నది అభిమానుల ప్రశ్న.

అభిమానుల ఫిర్యాదుపై బీసీసీఐలో కొత్తగా అంబుడ్స్‌మన్‌గా నియమితుడైన జస్టిస్‌ జైన్‌ దీనిపై గంగూలీని ప్రశ్నించాడట. ‘‘అవును.. ఇలా రెండు పదవుల్లో ఉంటూ విరుద్ధ ప్రయోజనాలు పొందడంపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి గంగూలీ వివరణ కోరాను. అతను జవాబు చెప్పడానికి వారం రోజుల గడువు ఇచ్చాను’’ అని జైన్‌ తెలిపాడు. ఈ వివాదం నేపథ్యంలో గంగూలీ ఢిల్లీ జట్టుని తప్పుకొంటాడా ? లేదంటే తన వివరణతో వివాదానికి పులిస్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తారా?? అన్నది చూడాలి.