కోల్‌కతాపై చెన్నై విజయం

మంగళవారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ 7 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 9 వికెట్లకు 108 పరుగులే చేసింది. రసెల్‌ (50 నాటౌట్‌; 44 బంతుల్లో 5×4, 3×6) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. దీపక్‌ చాహర్‌ (3/20) తో పాటు హర్భజన్‌ (2/15), జడేజా (1/17), తాహిర్‌ (2/21) అద్భుతంగా బౌలింగ్‌ చేశారు.

లక్ష్యం చిన్నదే అయినా చెన్నై ఛేదన అంత తేలిగ్గా ఏమీ సాగలేదు. డుప్లెసిస్‌ (43 నాటౌట్‌; 45 బంతుల్లో 3×4) పట్టుదల ప్రదర్శించడంతో లక్ష్యాన్ని చెన్నై 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 10 ఓవర్లలో చెన్నై స్కోరు 57 మాత్రమే. 14 ఓవర్లకు 77. ఆఖరులో కేదార్‌ జాదవ్‌ 8 నాటౌట్‌, డుప్లెసిస్‌ 43 నాటౌట్‌ పట్టుదలతో ఆడి చెన్నైకి విజయాన్ని అందించారు. ఇది చెన్నైకి ఐదో విజయం. ఈ విజయంతో చెన్నై పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకొంది.