పవన్’ని కమెడియన్ చేశారు

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని కమెడియన్ ని చేసేశారు నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళీ. ఆయన దర్శకత్వంలో ‘ముఖ్యమంత్రిగారూ మీరు మాటిచ్చారు’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో పవన్ కల్యాణ్ పాత్రలో అలీ నటిస్తున్నారు. పవన్-అలీ మంచి స్నేహితులు. ఐతే, ఇటీవల జరిగిన ఎన్నికల వేళ వీరిద్దరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకొన్నారు. ఇలాంటి నేపథ్యంలో పవన్ పాత్రలో అలీ కనిపించబోతుండటం ఆకట్టుకుంటోంది.
గత ఎన్నికల్లో పవన్‌ టీడీపీకి సపోర్ట్‌ ఇచ్చిన నేపథ్యాన్ని వాడుకుంటూ రాసిన కథతో సినిమా తెరకెక్కింది. ఇది ఓ రాష్ట్రానికి సంబంధించిన కథ కాదు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందే కథ. ప్రజాస్వామ్యం, ప్రజల క్షేమం గురించి తీశాం. కులం, డబ్బు, మందుని చూసి కాకుండా నిజాయతీగా సేవ చేసేవాడికి ఓటెయ్యండని ఈ సినిమాలో చెబుతున్నాం అన్నారు పోసాని. ఇందులో 2రీళ్లు రాజకీయాలుంటే, మిగిలిన 12 రీళ్లు వినోదం ఉంటుందని తెలిపారు. మొత్తానికి పోసాని పవన్ ని కమెడియన్ చేసేశారు.