మోడీపై ప్రియాంక.. పోటీ చేయడం లేదు !


ప్రధాని నరేంద్ర మోడీపై పోటీకి దిగేందుకు ప్రియాంక గాంధీ రెడీ అవుతున్నట్టు ప్రచారం జరిగింది. ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రధాని నరేంద్ర మోదీపై ప్రియాంక బరిలోకి దిగుతారని కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వారనాసి ఎన్నిక రసవత్తరంగా మారనుంది రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఐతే, మోడీపై పోటీకి దిగేందుకు ప్రియాంక సాహాసం చేయలేదు. వారనాసి నుంచి ప్రియాంక పోటీ చేయడం లేదు. ఆ స్థానం నుంచి మరోసారి స్థానికంగా పట్టున్న అజయ్‌ రాయ్‌ నే బరిలోకి దించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. 2014లో వారణాసిలో ప్రధాని మీద అజయ్ రాయ్‌తో పాటు ఆప్‌ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా పోటీ చేసిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి అజయ్ రాయ్ పై ఉంటుందని భావిస్తున్నారు. దీనికి తోడు వారనాసిలో ప్రధానిపై ఉన్న అసంతృప్తి కలిసొస్తుందని భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ ఏ స్థానం నుంచి బరిలోకి దిగబోతున్నారన్నది ఇంకా తేలలేదు.