తండ్రికి బెయిల్’పై కూతురు ఆందోళన

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతీరావు,
ఆయన సోదరుడు శ్రావణ్ కుమార్, కరీంలకు తెలంగాణ హైకోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీంతో వీరు ఆదివారం జైలు నుంచి విడుదలయ్యారు. ఐతే, తండ్రికి బెయిల్ ఇవ్వడంపై అమృత ఆందోళన వ్యక్తం చేసింది. మారుతీరావు కుటుంబం నుంచి తమకు ప్రాణహాని ఉందని తెలిసి వారికి బెయిల్‌ మంజూరు చేయడం సరికాదని అమృత ఆవేదన వ్యక్తం చేసింది

శనివారం అమృత మీడియాతో మాట్లాడింది. తన భర్తను హత్య చేయించిన వారికి బెయిల్‌ మంజూరు కావడం బాధాకరం. మారుతీరావు కుమార్తెగా కంటే తనకు ప్రణయ్‌ భార్యగా వచ్చిన గుర్తింపే సంతృప్తినిచ్చిందన్నారు. నిందితులు బయటకు వస్తే సాక్ష్యాధారాలు తారుమారు చేసే అవకాశం ఉందని, అందువల్ల వారి బెయిల్‌ను రద్దు చేయాలని పోలీసులు కూడా కోరుతున్నారని అమృత అన్నారు. మారుతీరావుకు బెయిల్ మంజూరు కావడంపై నల్గొండ పోలీసులు సుప్రీం కోర్టుని ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.