శ్రావణి హత్యకేసు : నిందితుడు గతంలో ఇద్దరిని చంపాడట


యాదాద్రి-భువనగిరి జిల్లా హజీపూర్ గ్రామంలో పదో తరగతి అమ్మాయి శ్రావణి హత్యకేసులో భయంకరమైన నిజాలు వెలుగులోనికి వస్తున్నాయి. శ్రావణి మృతదేహం దొరికిన భావిలో మరో అమ్మాయి మృతిదేహం కూడా దొరికింది. ఆ అమ్మాయి పేరు మనీషా. ఆమెది కూడా హజీపూర్ గ్రామమే. మనీషా ఇంటర్ చదువుతోంది. నెల రోజుల క్రిందట కనిపించకుండా పోయింది. ఐతే, మనీషా తల్లిదండ్రులు బయటికి చెప్పకుండా వెతుకుతున్నారు. శ్రావణి మృతదేహాం పక్కనే మనీషా శవం దొరకడంతో ఆమెని కూడా నిందితుడు శ్రీనివాస్ రెడ్డి చంపినట్టు పోలీసులు నిర్థారణకు వచ్చారు.

అంతేకాదు.. గత నాలుగేళ్ల క్రిందట ఇదే గ్రామం నుంచి కల్పన అనే అమ్మాయి అదృశ్యం అయింది. బహుశా.. ఆమెని కూడా శ్రీనివాస్ రెడ్డి చంపి ఉంటారని గ్రామస్థులు అంటున్నారు. శ్రావణి హత్యతో ఆవేశంతో ఉన్న గ్రామస్థులు నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. నిందితుడు భూమిని బాధిత కుటుంబాలకి పంచాలని కోరుతున్నారు. ఈ ఉదయం నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఇంటికి గ్రామస్థులు నిప్పంటించారు. పోలీసులు అడ్డుకొనే ప్రయత్నం చేసినా గ్రామస్థులు వినలేదు.