‘మహర్షి’ రికార్డుల వేట.. మొదలు !

‘మహర్షి’ రికార్డుల వేట ట్రైలర్ తోనే మొదలైంది. ఈ సినిమాపై చిత్రబృందం గట్టి నమ్మకంతో ఉంది. మహేష్ అభిమానులు గర్వపడేలా సినిమా ఉండబోతుంది. మహేష్ అభిమానులు కాలరెగిరేసే సినిమా ఇదని.. సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో దర్శకుడు వంశీ పైడిపల్లి అన్నారు. వంశీ చెప్పిన రేంజ్ లోనే మహర్షి ట్రైలర్ ఉంది. సినిమా రిలీజ్ కి ముందే సక్సెస్ మీట్ కి ఏర్పాట్లు చేసుకొంటోంది చిత్రబృందం. హిట్ పై చిత్రబృందానికి ఉన్న ధీమా అలాంటిది. ఈ విషయం పక్కనపెడితే.. ఈ ఇప్పుడీ ట్రైలర్ రికార్డులు సృష్టిస్తోంది. కేవలం 24గంటల్లోనే 8మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకొంది. నాన్ బాహుబలి రికార్డులన్నీ బద్దలు కొట్టింది.

ఇన్నాళ్లు నాన్ బాహుబలి రికార్డు ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ ట్రైలర్ పేరుమీద ఉంది. ఈ ట్రైలర్ 24గంటల్లో 6.9 మిలియన్ యూట్యూబ్‌ వ్యూస్‌ ని సొంతం చేసుకొంది. ఇప్పుడీ రికార్డుని మహర్షి ట్రైలర్ బద్దలు కొట్టింది. ఐతే, లైకుల విషయంలో మాత్రం మహర్షి కాస్త వెనకబడి ఉన్నాడు. మొత్తం వ్యూస్ లో అరవింద సమేతకు 3లక్షల లైకులొచ్చాయ్. మహర్షి మాత్రం 2లక్షల లైకులని మాత్రమే సంపాందించుకొన్నాడు. ఈ సాకుని చూపి మహర్షి వ్యూస్ ని కొన్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఐతే, అందులో ఏమాత్రం నిజంలేదన్నది మహర్షి చిత్రబృందం చెబుతోంది.

ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే హీరోయిన్. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. దిల్ రాజు-పివిపి-అశ్వినీదత్ నిర్మించారు. మే9న మహర్షి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.