అవి.. వైకాపా మైండ్ గేమ్ : చంద్రబాబు

గెలుపుపై వైకాపా ధీమాగా కనిపిస్తోంది. కాదు.. కాదు.. ఆల్రెడీ గెలిచేసినట్టు ఆ పార్టీ అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి’ నేమ్ ప్లేట్ ని రెడీ చేశారు. ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి ముహూర్తం కూడా ఖరారు చేశారు. అంతేకాదు… మంత్రి పదవులని పంచేస్తున్నారు. రోజాకి హోం శాఖని అప్పగించారు. సోషల్ మీడియాలో జోరుగా జరుగుతున్న ప్రచారమిది. ఈ ప్రచారంపై తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. అవన్నీ వైకాపా మైండ్‌గేమ్‌లో భాగమే అన్నారు.

శనివారం అమరావతిలోని హ్యాపీ రిసార్ట్స్‌లో తెదేపా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… “తెదేపా విజయంపై సందేహం లేదు. సీట్లు, ఆధిక్యతపైనే దృష్టి ఉంది. రాష్ట్రంలో జగన్‌ కుట్రలకు మోదీ, కేసీఆర్‌ కుతంత్రాలు తోడయ్యాయి. ఎందరు ఇబ్బందులు పెట్టినా ప్రజలు తెదేపా వెంటే ఉన్నారు. ఎన్నికల్లో అనేక మంది విలన్లను తట్టుకుని నిలబడ్డాం. తెలంగాణ కంటే మన ఆంధ్రప్రదేశ్ అనేక రంగాల్లో ముందుంది” అన్నారు.