వెంకీ మల్టీస్టారర్’పై తప్పుడు ప్రచారం

మల్టీస్టారర్ చిత్రాలకు విక్టరీ వెంకటేష్ కేరాఫ్ అడ్రస్. స్టార్ హీరోలు, యంగ్ హీరోలు ఆయనతో తెరను పంచుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఈ నేపథ్యంలో దర్శకులు వెంకీ కోసం మల్టీస్టారర్ కథలని తీసుకొస్తుంటారు. ఈ యేడాది ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ హిట్ అందుకొన్నాడు వెంకీ. వెంకీ-వరుణ్ తేజ్ కలిసి నటించిన ఎఫ్ 2 అసలైన సంక్రాంత్రి సినిమా అనిపించుకొంది. వందకోట్లకు పైగా కలెక్షన్లు. అత్యధిక లాభాలని తీసుకొంది. ఈ జోష్ లో నాగ చైతన్యతో కలిసి ‘వెంకీ మామ’ సినిమా చేస్తున్నారు వెంకీ.

ఈ సినిమా తర్వాత కూడా వెంకీ చేయబోయేది మల్టీస్టారర్ నే. తమిళ్ హిట్ చిత్రం ‘ విక్రమ్‌వేద’ రిమేక్ చేయబోతున్నారు. వెంకీ, నారా రోహిత్ కథానాయకులుగా విక్రమ్‌వేద రిమేక్ ఉండనుంది. ఇందులో మాధవన్ పాత్రలో వెంకీ, విజయ్ సేతుపతి నటించిన పాత్రలో నారా రోహిత్ నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ రిమేక్ రానుందని వార్తలొచ్చాయ్.

తాజాగా, ఈ ప్రచారంపై నిర్మాత సురేష్ బాబు స్పందించారు.”విక్రమ్ వేద` తెలుగు రీమేక్‌లో వెంకటేష్ నటించబోతున్నట్టు మీడియాలో వస్తున్న వార్త నిజం కాదు. ప్రస్తుతం ఆయన `వెంకీమామ` సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఆయన తర్వాతి సినిమా వివరాలు త్వరలో తెలియజేస్తాం” అని సురేష్ ప్రొడక్షన్స్ ట్విట్ చేసింది. దీంతో వెంకీ మల్టీస్టారర్ పై తప్పుడు ప్రచారం జరుగుతోందని తేలినట్టయింది.