ఐపీఎల్12 : ఫైనల్‌ చేరిన ముంబై


ముంబయి ఇండియన్స్ ఐపీఎల్‌ 12వ సీజన్‌ ఫైనల్‌ చేరింది. మంగళవారం చెపాక్‌ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో ముంబయి 6వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సూపర్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. అంబటిరాయుడు (42; 37 బంతుల్లో 3×4, 1×6), ధోనీ(37; 29 బంతుల్లో 3×6) బాధ్యతాయుతంగా ఆడి 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ముంబయి బౌలర్లలో రాహుల్‌ చాహర్‌ 2, కృనాల్‌ పాండ్య, జయంత్‌ యాదవ్‌ చెరో వికెట్‌ తీశారు.

132పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయికి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్ రెండో బంతికే రోహిత్ శర్మ (2) అవుటయ్యారు. కష్టాల్లో పడిన జట్టును సూర్యకుమార్‌ యాదవ్‌(71; 54 బంతుల్లో 10×4), ఇషాన్‌ కిషన్‌(28, 31 బంతుల్లో 1×4, 1×6) ఆదుకున్నారు. చివర్లో హార్దిక్‌ పాండ్య(13; 11 బంతుల్లో 1×4) ముంబయిని విజయతీరాలకు చేర్చారు. చెన్నై బౌలర్లలో ఇమ్రాన్‌ తాహిర్‌ రెండు వికెట్లు తీయగా దీపక్‌ చాహర్‌, హర్భజన్‌ చెరో వికెట్‌ తీశారు.