దారుణం : మహిళలకు బదులుగా ఓటేసిన పోలింగ్ ఏజెంట్‌


ఆదివారం జరిగిన ఆరో విడత పోలింగ్ లో చోటు చేసుకొన్న ఓ ఘటన ఆశ్చర్యానికి గురిచేస్తోంది. హర్యానాలోని ఫరీదాబాద్ నియోజకవర్గంలోని అసౌటి పోలింగ్ బూత్‌లో మహిళలకి బదులుగా పోలింగ్ ఏజెంట్ ఓట్లు వేయడం కలకలం రేపింది. పోలింగ్ బూత్‌లో కూర్చొన్న ఓ ఏజెంట్.. ఈవీఎం కంపార్ట్‌మెంట్ వద్దకు వెళ్లి అక్కడ మహిళ ఉండగానే అతడు ఓటేశాడు. ఇలా ముగ్గురు మహిళల ఓట్లు ఆ పోలింగ్ ఏజెంటే ఓటేశాడు. ఆ ఏజెంట్ ని పోలింగ్ అధికారులు బద్దలించకపోవడం గమనార్హం.

ఈ తతంగాన్ని అంతా అక్కడున్న ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. ఈ సంఘటనపై ఫరీదాబాద్ జిల్లా ఎన్నికల అధికారి స్పందించారు. సదరు పోలింగ్ ఏజెంట్‌ను పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, ముగ్గురు మహిళల ఓట్లు వేసినట్లు తమకు తెలిసిందని చెప్పారు. ఐతే, ఆ ఏజెంట్ ఏ పార్టీకి చెందినవారు అన్నది తెలియాల్సి ఉంది.