సుదర్శన్’లో మహర్షి సందడి


హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సుదర్శన్ థియేటర్ లో బుధవారం మహర్షి చిత్రబృందం సందడి చేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన సూపర్ స్టార్ మహేష్.. మరోసారి అభిమానులకి ధన్యవాదాలు తెలిపారు. సుదర్శన్ నా సొంత థియేటర్ లాంటిది. ఈ థియేటర్ లోనే నాన్నతో కలిసి మురారి సినిమా చూశా. సినిమా చూశాక నాన్నగారు నా భుజంమీద చేయి వేశారు. అది ఎప్పటికి మర్చిపోను. నా సొంత థియేటర్ ‘ఏఎంబి’ని కాదని ఇక్కడికొచ్చానన్నారు. ఇక, ఈసారి అభిమానుల మధ్య కాలరెగిరేశాడు మహేష్.

మహర్షి సినిమా చేసినందుకు గర్వపడుతున్నాని మహేష్ చెబుతున్నారు. ఈ చిత్రంలో దేశంలోని విద్యా వ్యవస్థలోని లోపాలు, రైతుల సమస్యలని లేవనెత్తాడు దర్శకుడు వంశీపైడిపల్లి. అదే సమయంలో కమర్షియల్ ఎలిమెంట్స్ ని మిస్ కాలేదు. ఈ నేపథ్యంలో ప్రశంసలతో పాటు కలెక్షన్స్ వర్షం కురుస్తోంది. మహర్షిని చూసి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం ఫిదా అయ్యారు. అందరూ చూడాల్సిన సినిమా. చాలా చక్కగా తీశారని కితాబిచ్చారు. ఇక, అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి ప్రశంసల వర్షం ఇంకా ఆగడం లేదు.