ఏపీ ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం – హైలైట్స్

ఆంధ్రప్రదేశ్‌ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగించారు.గవర్నర్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు చూద్దాం..

* మా ప్రభుత్వం సేవ చేసేందుకు కట్టుబడి ఉంది. నూతన విధానాలు ప్రవేశపెట్టి సుపరిపాలన అందిస్తాం.

* విభజనచట్టంలో పేర్కొన్న అంశాలన్నీ నెరవేర్చేలా కేంద్రంపై ఒత్తిడి చేస్తాం.

* అవినీతి రహిత పాలన ద్వారా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తాం. దీనిలో భాగంగా రాష్ట్రంలోకి సీబీఐకి అనుమతి ఇచ్చాం.

* ప్రజాధనం వృథా కాకుండా అనేక చర్యలు తీసుకుంటాం. ప్రాజెక్టుల్లో పారదర్శకత కోసం రివర్స్‌ టెండరింగ్‌ చేపడతాం.

* నవరత్నాల అమలు కోసం మా ప్రభుత్వం కృషి చేస్తుంది. పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు చర్యలు తీసుకుంటాం.

* రాష్ట్రంలో ప్రజా సమస్యలు ఇంకా వెంటాడుతున్నాయి. విభజన సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తాం. వందశాతం పారదర్శకత దిశగా సీఎంవో పనిచేస్తుంది.

* అర్హులైన ప్రతి ఒక్కరికీ గృహవసతి కల్పిస్తాం. నాలుగేళ్లలో 25లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

* ఉద్యోగాల భర్తీ క్యాలెండర్‌ను ఏటా జనవరిలో ప్రకటిస్తాం. యువతకు పలు రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. పరిశ్రమలకు అవసరమైన ఉద్యోగాల్లో యువతకు శిక్షణ ఇస్తాం.

* పాడి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం. రైతులు, వ్యవసాయ కూలీల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటాం. వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కింద ప్రతి రైతుకు రూ.12,500 అందిస్తాం. సహకార రంగాన్ని బలోపేతం చేస్తాం.

* సహకార డెయిరీలకు పాలుపోసే రైతులకు లీటరుకు రూ.4 ప్రోత్సాహకం

* పోలవరం, వెలిగొండ ప్రాజెక్టును నిర్ణీత సమయంలోగా పూర్తి చేస్తాం.

* అమ్మఒడి పథకం కింద మహిళలకు ఏటా రూ.15,000 ఆర్థికసాయం చేస్తాం.

* దశలవారీగా దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తాం. మద్యం బెల్టుషాపులను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

* బీసీ, ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తాం.

* 108 వాహనాలకు పూర్వ వైభవం తీసుకొస్తాం.

* రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా బోర్లు వేయిస్తాం. బోర్లు వేసేందుకు నియోజకవర్గానికి ఒక రిగ్‌ కేటాయిస్తాం.

* రైతులకు పగటిపూట 9గంటలపాటు ఉచిత విద్యుత్‌. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం.

* రూ.2వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయనిధి ఏర్పాటు చేస్తాం.

* వ్యవసాయ విధానాల అమలు పర్యవేక్షణకు రైతు కమిషన్‌ ఏర్పాటు యోచన.

* పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను రూ.12వేల నుంచి 18 వేలకు పెంచాం.

* కేంద్ర ప్రభుత్వం, పొరుగు రాష్ట్రాల సహకారంతో ముందుకెళ్తాం.

* ఆశా వర్కర్ల వేతనాలను రూ.3వేల నుంచి రూ.10వేలకు పెంచాం. ప్రభుత్వ ఉద్యోగులకు 27శాతం మధ్యంతర భృతి. పెంచిన మొత్తాన్ని ఈ ఏడాది జులై నుంచి చెల్లిస్తాం.