మళ్లీ అదే ప్రశ్న.. నం.4 ఎవరు ?

టీమిండియాలో నం.4 స్థానంపై చాన్నాళ్లుగా చర్చ జరిగింది. ఆ స్థానాన్ని కెఎల్ రాహుల్ భర్తీ చేశాడు. ఐతే, శిఖర్‌ ధావన్‌కు గాయమవ్వడంతో కేఎల్‌ రాహుల్‌ ఓపెనింగ్‌కి ప్రమోట్‌ అయ్యాడు. దీంతో నాలుగో డౌన్‌లో ఎవరు వస్తారనేది ప్రశ్నగా మారింది.

ఆల్‌రౌండర్‌ విజయ్‌శంకర్‌ అని కొందరు అంటుంటే… కొత్తగా జట్టులోకి వచ్చిన రిషబ్‌ పంత్‌ అని మరికొందరు చెబుతున్నారు. దినేశ్‌ కార్తిక్‌ బాగుంటాడని కొందరు అంటున్నారు. శనివారం అఫ్గాన్‌తో మ్యాచ్‌ లో నం.4గా ఎవరు ఆడతారన్నది ఆసక్తిగా మారింది.

మరోవైపు, టీమిండియాని వరుస గాయాలు భయపెడుతున్నాయి. గాయంతో ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రపంచకప్ మొత్తానికి దూరమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు విజయ్ శంకర్ కాలికి గాయమైంది. ఆయన ఫిట్ గా ఉన్నాడా ? లేదా అన్నది శుక్రవారం తేలనుంది.