నాగబాబు డబ్బు మనిషి

మెగా బ్రదర్ నాగబాబు 49యేళ్ల వయసులో డబ్బు మనిషిగా మారడట. అప్పుడే ఆయనకి డబ్బు విలువ తెలిసిందట. అప్పటి నుంచి పొదుపు మంత్రం పాటించానని తెలిపారు నాగబాబు. ఆయన ‘నా ఛానెల్ నా ఇష్టం’ యూట్యూబ్ ఛానల్ ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఛానల్ లో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకి నాగబాబు సమాధానం చెప్పారు.

డబ్బు విషయంపై లోతుగా వివరణ ఇచ్చారు. ‘జీవితం అనే బండి నడవాలంటే ధనం కావాలి.. మోటారు వాహనం నడవాలంటే ఇంధనం కావాలి’ అన్నారు. మనిషికి డబ్బే ముఖ్యం కాదని దానికి మించి మానవత్వం, వ్యక్తిత్వం లాంటివి ఉన్నాయని చాలా మంది చెబుతుంటారని, కానీ అవన్నీ ఉత్తి మాటలే. మనిషికి అన్నింటి కంటే డబ్బే ముఖ్యమన్నారు.

“నేను డబ్బు లేక ఇబ్బందులు పడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. నాకు 49వ సంవత్సరంలో డబ్బు విలువ తెలిసొచ్చింది. అప్పటి వరకు నేను డబ్బును దుర్వినియోగం చేసి ఉండక పోవచ్చు గానీ, డబ్బు సంపాదించాలనే కసి నాలో వచ్చేది కాదు. తర్వాత సంపాదించాను. మీరు ఉద్యోగంలో చేరిన నాటి నుంచే డబ్బు సంపాదన మొదలు పెట్టండి. మీ సంపాదనలో కనీసం 10 శాతాన్ని పొదుపు చేయండని సూచించారు నాగబాబు.