చంద్రబాబు మరో షాక్.. కుటుంబానికి భద్రత తగ్గింపు !

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుకి మరో షాక్ తగిలింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక.. చంద్రబాబు భద్రతని తగ్గించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన తనయుడు నారా లోకేష్ కి భద్రత తగ్గించారు. జెడ్‌ కేటగిరీ ఉన్న లోకేశ్‌కు భద్రత తగ్గించి 2+2 గన్‌మెన్లను కేటాయించారు. మిగిలిన కుటుంబ సభ్యులకు పూర్తిగా భద్రత తొలగించారు.

చంద్రబాబు కుటుంబం విదేశీ పర్యటన ముగించుకుని మంగళవారం ఉదయమే హైదరాబాద్‌ చేరుకున్నారు. కనీస సమాచారం ఇవ్వకుండా.. చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండగా భద్రత తగ్గించడంపై తెదేపా శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జగన్ సీఎం అయ్యాక దుబారా ఖర్చులకి చెక్ పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భద్రత విషయంలోనూ ఆయన కోత విధిస్తున్నట్టు కనబడుతోంది.