జగన్ కు పవన్ ఫుల్ సపోర్ట్

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొన్న అక్రమభవనాల కూల్చివేత నిర్ణయానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతుపలికారు. తెదేపా ప్రభుత్వం దాదాపు రూ.8కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రజావేదికకు అనుమతుల్లేవని అధికారులు కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై పవన్ తొలిసారి స్పందించారు. గుంటూరు జిల్లా నంబూరులో దశావతార వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభ వేడుకలో పవన్ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వం చేపటిన్న అక్రమ కట్టడాల కూల్చివేతపై పవన్ స్పందించారు. ప్రజావేదికతో సరిపెట్టకుండా అనుమతిలేని మిగతా భవనాలను కూడా కూల్చివేయాలన్నారు. అనుమతిలేని అన్ని భవనాలను కూలిస్తేనే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు. ఇక, ప్రజావేదిక కూల్చివేత తర్వాత దాని పక్కనే ఉన్న.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసాన్ని కూడా కూల్చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అది కూడా అక్రమ కట్టడమేనని కలెక్టర్ల సమావేశంలో జగన్ చెప్పిన సంగతి తెలిసిందే.