వి.వి.వినాయక్‌ ఇంటిని కూల్చేశారు


ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌కు జీహెచ్‌ఎంసీ అధికారులు షాక్‌ ఇచ్చారు. ఆయనకు చెందిన భవనాన్ని కూల్చేశారు. నగర శివారులోని నార్సింగి ప్రాంతంలో అక్రమ నిర్మాణాలని మున్సిపల్‌ అధికారులు కూల్చేస్తున్నారు. ఇందులో భాగంగా వట్టినాగులపల్లి గౌలిదొడ్డిలోని సర్వే నంబర్‌ 223లో రెండు అంతస్తుల భవనం కోసం అనుమతి తీసుకొని ఆరంతస్తుల్లో నిర్మించిన రెండు భవనాలను కూల్చివేశారు. అందులో వినాయక్‌కు చెందిన భవనం కూడా ఉందని నార్సింగి మున్సిపల్‌ కమిషనర్‌ టి.కృష్ణమోహన్‌ తెలిపారు.

ఈ భవనాల నిర్మాణానికి అనుమతి పత్రాలు అధికారుల నుంచి కాకుండా అప్పట్లో సర్పంచ్‌ వద్ద నుంచి తీసుకున్నారని కమిషనర్ తెలిపారు. రెండుసార్లు నోటీసులు జారీ చేసినా ఎవరూ స్పందించలేదన్నారు. ఇక, ఈ విషయంపై దర్శకుడు వివి వినాయక్ ఇప్పటి వరకు స్పందించలేదు. ప్రస్తుతం వినాయక్ చేతిలో సినిమాలేవీ లేవు. ఐతే, ఆయన హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకొంటున్నారు.