దాడిచేస్తే డయల్‌ 7306299999

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కీలక నిర్ణయం తీసుకొన్నారు. తెదేపా కార్యకర్తలకు రక్షణగా టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. వైకాపా దాడులకు పాల్పడినా, కేసుల పేరుతో వేధించినా వెంటనే 7306299999 నంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం అందించాలని సూచించారు. వైకాపా దాడులని న్యాయపరంగా ఎదుర్కొందామని అన్నారు.

బాధిత కుటుంబాలను ఆదుకొనేందుకే ఈ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు లోకేశ్‌ తెలిపారు. 30 రోజుల్లో 100 చోట్లకు పైగా దాడులు, దౌర్జన్యాలకు పాల్పడటం దారుణమన్నారు. ఆరుగురిని అత్యంత దారుణంగా చంపడం కిరాతకమని మండిపడ్డారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా ఘోర ఓటమి తర్వాత ఆ పార్టీ నేతలు బీజేపీలోనికి క్యూ కడుగుతున్నారు. మరికొందరు అధికార పార్టీ వైకాపా వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెదేపా కార్యకర్తల రక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకొంటున్నట్టు కనబడుతోంది.