బడ్జెట్ ఎఫెక్ట్ : భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు


2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి శుక్రవారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
ఆదాయపన్ను పరిమితిలో ఎలాంటి మార్పులు చేయలేదు. తొలిసారి గృహ రుణం తీసుకుని ఇల్లు కట్టుకునే వారికి ప్రోత్సాహకాలు ప్రకటించారు. ప్రసంగం చివర్లో మాత్రం షాకింగ్ విషయాలు చెప్పారు. బంగారంపై ఎక్సైజ్ డ్యూటీని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించారు. అంతేకాదు.. పెట్రోలియం, డీజిల్‌పై కూడా ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతున్న తెలిపారు.

ఈ నేపథ్యంలో పెట్రోల్, డిజీల్ ధరలు భారీగా పెరగనున్నాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.2.50 పైసలకిపైగా, లీటర్ డీజిల్ ధర రూ.2.30 పైసలకుపైగా పెరగనుంది. ఎక్సైజ్ డ్యూటీ, రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్ రూపంలో రూ.2 మేర పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచడంతో.. కేంద్ర ఖజానాకు రూ.28 వేల కోట్లు అదనంగా చేరనున్నాయి. కేంద్ర పన్నులు పెంచడంతో.. ఆటోమెటిగ్గా లోకల్ ట్యాక్స్‌లు కూడా పెరుగుతాయి. పెట్రో ధరల పెరుగుదల సామాన్యుడికి మరింత భారం కానున్నాయి.