ఆంధ్రప్రదేశ్ గవర్నర్’గా బిశ్వభూషణ్‌


ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని సెక్షన్‌ 7 ప్రకారం ఇప్పటివరకూ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ కొనసాగుతూ వచ్చారు. కొన్నాళ్లుగా తెలుగు రాష్ట్రాలకి వేర్వేరుగా గవర్నర్లని నియమించాలనే డిమాండ్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్ గా బిశ్వభూషణ్‌ హరిచందన్ ను నియమిస్తూ మంగళవారం రాష్ట్రపతిభవన్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.

85 ఏళ్ల బిశ్వభూషణ్‌ హరిచందన్‌ భాజపా-బీజేడీ సంకీర్ణ ప్రభుత్వంలో తొమ్మిదేళ్లు పరిశ్రమలు, రెవెన్యూ, న్యాయశాఖల మంత్రిగా సేవలందించారు. భువనేశ్వర్‌ అసెంబ్లీ స్థానం నుంచి మూడుసార్లు, చిలికా అసెంబ్లీ స్థానం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

1971లో భారతీయ జన్‌సంఘ్‌లో చేరి ఆ పార్టీ జాతీయ కార్యనిర్వాహక సభ్యుడిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో మీసా చట్టం కింద జైలుకెళ్లారు. భాజపా ఏర్పడిన తర్వాత ఆ పార్టీలో చేరి 1980 నుంచి 1988 వరకు ఒడిశా భాజపా అధ్యక్షుడిగా పనిచేశారు. 1988లో జనతాపార్టీలో చేరి ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. 1996లో తిరిగి భాజపాలో చేరారు.