మళ్లీ గీతలోకి బోయపాటి

మాస్ కు సరైనోడు బోయపాటి శ్రీను. ఆయన కొడితే గట్టిగానే కొడతాడు. బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొంటాడు. అందుకే బోయపాటి దర్శకత్వంలో నటించేందుకు స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తుంటారు. ఐతే, ‘వినయ విధేయ రామ’ సినిమాతో పరిస్థితి మారింది. బోయపాటి ఇమేజ్ ని డ్యామేజ్ చేసిన సినిమా ఇది. సినిమా ఫలితం పక్కనపెడితే.. నష్టాల నేపథ్యంలో రెమ్యూనరేషన్ కాస్త తగ్గించుకోవాలన్న రామ్ చరణ్ సూచనని బోయపాటి తిరస్కరించారు. ఈ విషయంలో రామ్ చరణ్ విడుదల చేసిన లేఖ బోయపాటిని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది.

అప్పటికే సినిమా ఓకే అయిన బాలయ్య హ్యాండిచ్చాడు. అప్పటి వరకు బోయపాటి ఎప్పుడంటే అప్పుడే అన్న.. మహేష్ బాబు, అఖిల్ ఇతర సినిమాలతో బిజీ అయిపోయారు. బాలయ్య సినిమా చేతిలో ఉన్న.. నిర్మాత దొరకలేదు. ఈ నేపథ్యంలో బోయపాటికి సినిమాలే లేకుండాపోయాయి. ఆయన గత ఆర్నేళ్లుగా ఖాళీ. ఐతే, ఫైనల్ గా బోయపాటికి గీతా ఆర్ట్స్ నుంచి భరోసా దక్కింది. త్వరలో బోయపాటితో సినిమా ఉంటుందని నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించారు.

ఆర్ఎక్స్100 హీరో కార్తీకేయ నటించిన మూడో చిత్రం ‘గుణ369’ ట్రైలర్ విడుదల కార్యక్రమానికి బోయపాటి, అల్లు అరవింద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ.. త్వరలోనే గీతా ఆర్ట్స్ లో బోయపాటి సినిమా ఉంటుందని తెలిపారు. గతంలో గీతలో ‘సరైనోడు’ సినిమా చేశాడు బోయపాటి. ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఐతే, తాజా సినిమాలో హీరో ఎవరన్నది తెలియాల్సి ఉంది. బహుశా.. బోయపాటి-బాలయ్య సినిమా గీతలో తెరకెక్కుతుందేమో.. !