అందుకే ‘సాహో’ని వాయిదా వేశారట !


ఊహించినట్టే ప్రభాస్ ‘సాహో’ వాయిదా పడింది. ఆగస్టు15న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ‘సాహో’ని అదే నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు చిత్రబృందం అధికారిక ప్రకటన చేసింది. వాయిదాకి గల కారణాలని కూడా తెలిపింది. సినిమాను అత్యంత నాణ్యతతో అభిమానులను అలరించేలా తీర్చిదిద్దడంలో ఆలస్యం అవుతుండటం వల్లే సినిమా విడుదల వాయిదా వేసినట్లు తెలిపింది. ముఖ్యంగా యాక్షన్‌ సన్నివేశాలకు అదనపు హంగులు జోడించడం వల్ల నిర్మాణానంతర కార్యక్రమాలు ఆలస్యమైనట్లు పేర్కొంది.

సుజీత్ దర్శకత్వంలో సాహో తెరకెక్కుతోంది. శ్రద్ధాకపూర్‌ కథానాయిక. జాకీ ష్రాఫ్‌, నీల్‌ నితిన్‌ ముఖేష్‌, అరుణ్ విజయ్‌, వెన్నెల కిషోర్‌, మురళీ శర్మ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. తనిష్క్‌ బాగ్చ, జిబ్రాన్‌ సంగీతం అందిస్తున్నారు. దాదాపు రూ. 300కోట్ల బడ్జెట్ తో యువీ క్రియేషన్స్‌ నిర్మిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో (ఆగస్ట్30) విడుదల చేయనున్నారు.