సెలక్షన్‌ ఆదివారానికి వాయిదా


వెస్టిండీస్‌ పర్యటనకు భారత జట్లను ఎంపిక చేసేందుకు నేడు జరగాల్సిన సెలక్షన్‌ కమిటీ సమావేశం అనూహ్యంగా ఆదివారానికి వాయిదా పడింది. ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఇకపై సెలక్షన్‌ సమావేశాలకు బోర్డు కార్యదర్శి హాజరు కారాదని పరిపాలకుల కమిటీ (సీఓఏ) కొత్త నిబంధన తీసుకొచ్చింది. లోధా ప్యానెల్‌ సూచించిన సంస్కరణల్లో భాగంగా ఈ నిబంధనను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో కొన్ని న్యాయపరమైన విధానాలను అనురించాల్సివుంది.

ఇదీగాక, ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ నివేదికలు శనివారం సాయంత్రానికి అందనున్నాయి. ఈ కారణాల వలన శుక్రవారం జరగాల్సిన సెలక్షన్ ఆదివారానికి వాయిదా పడింది. ఇక, ధోని భవిష్యత్తేంటి ? రిటైరవుతాడా.. కొనసాగుతాడా ? అన్న ఆసక్తి కొనసాగుతూనే ఉంది. బ్యాటింగ్‌లో ఒకప్పటి పదును లోపించిన 38 ఏళ్ల ధోనీపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశముంది. ఆగస్టు 3న ఆరంభమయ్యే విండీస్‌ పర్యటనలో భారత్‌ మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడుతుంది.