బిగ్ బాస్ ఎఫెక్ట్ : అన్నపూర్ణ స్టూడియో ముట్టడికి ఓయూ విద్యార్థులు

బిగ్ బాస్3 ప్రారంభానికి ముందే వివాదాలు మొదలయ్యాయి. ఈ రియాలిటీ షో ముసుగులో కాస్టింగ్ కౌచ్ జరుగుతోంది. సభ్యులను ఇబ్బంది పెడుతున్నారంటూ.. యాంకర్ శ్వేతా రెడ్డి, నటి గాయత్రి గుప్తా కోర్టులో కేసులు వేశారు. మరోవైపు సెన్సార్ నిర్వహించిన తర్వాత ఈ షోని ప్రసారం చేయాలనే పిటిషన్ దాఖలైంది. తాజాగా ఓయూ విద్యార్థులు బిగ్ బాస్ షో పై యుద్ధం ప్రకటించారు.

ఇప్పటికే బిగ్ బాస్3పై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు ఓయూ విద్యార్థులు. తాజాగా బిగ్ బాస్ 3కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జునకి చెందిన అన్నపూర్ణ స్టూడియో ముట్టడికి ఓయూ విద్యార్థులు బయలుదేరారు. కందుల మధు ఆధ్వర్యంలో అన్నపూర్ణ స్టూడియోను ముట్టడి చేయనున్నారు. షోని నిలిపివేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు బిగ్ బాస్ షోపై వచ్చిన ఆరోపణలపై బిగ్ బాస్ యాజమాన్యం గానీ, నాగార్జున గానీ స్పందించలేదు. మరీ.. ఓయూ విద్యార్థుల అన్నపూర్ణ స్టూడియో ముట్టడిపైనైనా స్పందిస్తారేమో చూడాలి.