సొంతూరుకు కేసీఆర్ వరాల జల్లు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంతగ్రామం సిద్దిపేటలోని చింతమడకలో పర్యటిస్తున్నారు. తొలుత గ్రామంలోని శివాలయం, రామాలయం, గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్థులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడిన కేసీఆర్.. పుట్టిన ఊరుకు వరాల జల్లు కురిపించారు. గ్రామంలోని ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల లబ్ధి చేకూరుస్తామన్నారు. వలస వెళ్లిన వారిని కూడా పిలిచి పథకాలు అందేలా చూడాలన్నారు. ప్రభుత్వం అందించే లబ్ధి ద్వారా యువత ఉపాధి పొందాలని సూచించారు. ఎవరు ఏ ఉపాధి మార్గం ఎంచుకున్నా అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.
ఊరు బాగుపడాలంటే ప్రజలంతా ఐక్యంగా కదలాలన్నారు. నెలరోజుల్లో చింతమడక గ్రామంలో సమస్యలు లేకుండా చేయాలని కలెక్టర్‌, ఎమ్మెల్యేలను కోరారు. ఈ సందర్భంగా తన చిన్ననాటి జ్ఞాపకాలను గ్రామస్థులతో పంచుకున్నారు.