కేసీఆర్’కు గవర్నర్ షాక్


గవర్నర్ నరసింహన్ ముఖ్యమంత్రి కేసీఆర్ మనిషి. ఆయన సీఎం చెప్పిందల్లా చేస్తున్నారని ప్రతిపక్ష నేతలు గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. అది నిజమే అన్నట్టుగా ఇన్నాళ్లు కేసీఆర్-నరసింహాన్ బంధం కొనసాగినట్టు అనిపించింది. ఇప్పుడీ బంధం చెడిందా ? అనే అనుమానాలు కలుగుతున్నాయ్. తాజాగా, తెలంగాణ నూతన పురపాలక చట్టానికి సంబంధించిన బిల్లుని గవర్నర్ వెనక్కి పంపారు. బిల్లులోని కొన్ని అంశాలపై గవర్నర్‌ నరసింహన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో బిల్లుకు ఆయన ఆమోదం లభించలేదు.

కొత్త పురపాలక చట్టం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బిల్లు తీసుకువచ్చింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో శాసనసభ, మండలి ఆమోదం కూడా పొందింది. వాస్తవానికి ఆ మరుసటి రోజే గవర్నర్‌ ఆమోదం పొంది కొత్త చట్టం అమల్లోకి రావాల్సి ఉంది. కానీ, ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వానికే పూర్తి స్థాయి అధికారాలు ఉండటం పట్ల నరసింహన్‌ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ బిల్లుకు ఆయన మరికొన్ని సూచనలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గవర్నర్‌ సూచించిన అంశాలతో ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసింది.