బాలుడి కిడ్నాప్.. సుఖాంతం !


మండపేటలో బాలుడి కిడ్నాప్‌ వ్యవహారం సుఖాంతమైంది. జషిత్‌ను జిల్లా ఎస్పీ నయీం అస్మి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. సోమవారం రాత్రి నాయనమ్మ పార్వతిపై దాడిచేసి దుండగులు బాలుడిని ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. గురువారం తెల్లవారుజామున బాలుడిని ఆగంతుకులు రాయవరం మండలం కుతుకులూరులో ఇటుకబట్టీల ప్రాంతంలో విడిచిపెట్టి వెళ్లారు. అప్పటికే టీవీ, సోషల్ మీడియాలో జషిత్ కిడ్నప్ వ్యవహారం చూసిన స్థానికిలు.. బాలుడి గుర్తుపట్టి తల్లిదండ్రులకి ఫోన్ చేసి సమాచారం అందించారు. సమాచారం తెలుసుకొన్న పోలీసులు వెంటనే వచ్చి బాలుడిని తీసుకొచ్చి తల్లిదండ్రులకి అప్పగించారు.

వ్యక్తిగత కారణాలే బాలుడి అపహరణకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు. అతి త్వరలోనే కిడ్నాపర్లని అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. ఇక, తనిని రాజు అనే వ్యక్తి తీసుకెళ్లాడని జషిత్ చెబుతున్నారు. ఇంతకీ రాజు ఎవరు ? బాలుడ్ని ఎందుకు కిడ్నాప్ చేశాడు ?? అనే విషయాలు పోలీసులు దర్యాప్తులో తేలనున్నాయి. ఇక, బాలుడి క్షేమంగా ఇంటికి చేరడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. మీడియాతో జషీత్ ఉత్సాహంగా మాట్లాడటం ఆకట్టుకొంది.