పుణెరిపై యు ముంబా గెలుపు


ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌లో యు ముంబా తిరిగి విజయాల బాట పట్టింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 33-23 తేడాతో పుణెరి పల్టాన్‌ను ఓడించింది. కెప్టెన్‌ ఫజల్‌ (4), సందీప్‌ నర్వాల్‌ (4), సురీందర్‌ సింగ్‌ (4) త్రయం డిఫెన్స్‌లో సత్తాచాటి ప్రత్యర్థి రైడర్లను ఓ పట్టు పట్టారు. రైడింగ్‌లో అభిషేక్‌ సింగ్‌ (5) ఆకట్టుకున్నాడు. పుణెరి జట్టులో సుర్జీత్‌ సింగ్‌ (6), పవన్‌ కడియాన్‌ (4) మెరిశారు.

ఆరంభంలో ధాటిగా ఆడిన పుణెరి ఆటగాళ్లు మ్యాచ్‌ జరిగే కొద్దీ రైడింగ్‌లో, టాకిల్‌లో పూర్తిగా విఫలమై ఢీలా పడి ప్రత్యర్థికి దాసోహమయ్యారు. యు ముంబా ధాటికి పుణెరి పల్టాన్‌ జట్టు రెండు సార్లు ఆలౌటైంది. ఈ సీజన్‌లో ముంబాకు ఇది రెండో విజయం కాగా.. పుణెరికి వరుసగా రెండో పరాజయం. ఈ మ్యాచ్‌కు టీమిండియా సారధి విరాట్ కోహ్లీ ముఖ్య అతిథిగా హారయ్యారు.