#మీటూ కాన్సెప్ట్ తో బాలీవుడ్ కామ్రేడ్

టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ టాలెంట్ ఏంటో బాలీవుడ్ కు తెలుసు. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత విజయ్ తో సినిమా చేసేందుకు ప్రముఖ బాలీవుడ్ దర్శక-నిర్మాత ఆసక్తి చూపారు. ఇక, అర్జున్ రెడ్డి బాలీవుడ్ రిమేక్ ‘కబీర్ సింగ్’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రానికి మాతృక దర్శకుడు సందీప్ వంగా దర్శకత్వం వహించారు. షాహిద్ కపూర్-కైరా అడ్వానీ జంటగా నటించారు. కబీర్ సింగ్ ఏకంగా రూ. 300కోట్లకిపైగా కలెక్ట్ చేసింది. ఈ హిట్ కిక్కులో ఉన్న కైరా, షాహిద్, సందీప్ లకి ఆఫర్లు క్యూకడుతున్నాయి.

మరోవైపు, విజయ్ దేవకొండ ‘డియర్ కామ్రేడ్’ని విడుదలకి ముందే కరణ్ జోహార్ చూసేశారు. సినిమా అద్భుతంగా ఉందని కితాబిచ్చాడు. హిందీలో రిమేక్ చేస్తానని ప్రకటించేశారు. ఈ నేపథ్యంలో ఈ రిమేక్ లో ‘ధడక్’ పెయిర్ ఇషాన్-జాన్వీలు నటిస్తారనే ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడీ సినిమా గురించి మరో ఆసక్తికర విషయం బయటికొచ్చింది. డియర్ కామ్రేడ్ ని లేడీ ఓరియెంటెడ్ సినిమాగా తీసుకురావాలనే ఆలోచనలో కరణ్ ఉన్నారట. #మీటూ కాన్సెప్టుతో ‘లేడీ కామ్రేడ్’ కథని రెడీ చేస్తున్నారంట. ఇప్పటికే కథపై కసరత్తు జరుగుతుందట. మరీ.. లేడీ కామ్రేడ్ గా ఎవరు ? కనిపించబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

ఇక, గత నెల 26న ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘డియర్ కామ్రేడ్’కు మిక్సిడ్ టాక్ వచ్చింది. సినిమా బాగుంది. కానీ స్లోగా ఉందనే విమర్శలొచ్చాయ్. ఈ నేపథ్యంలో కామ్రేడ్ కు అరగంట ట్రిమ్మింగ్ చేశారు. ఐతే, అప్పటికే కామ్రేడ్ బోరింగ్ అనే టాక్ జనాల్లోకి వెళ్లింది. ఇప్పుడు నష్ట నివారణ చర్యలు చేపట్టిన పెద్ద ఫలితం ఉండదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.