తారక్-కల్యాణ్’లతో త్రివిక్రమ్ సినిమా ఫిక్స్


త్రివిక్రమ్ తో సినిమా చేయాలన్నది తారక్ కల. ఆ కల ‘అరవింద సమేత వీర రాఘవ’తో తీరింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకొంది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్-తారక్ మరోసారి జోడి కట్టాలని అభిమానులు ఆశపడుతున్నారు. ఆ కోరిక త్వరలోనే తీరబోతున్నట్టు సమాచారమ్. త్రివిక్రమ్ తదుపరి సినిమా తారక్ తో ఉండబోతుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని కల్యాణ్ రామ్ నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ‘జై లవ కుశ’ చిత్రాన్ని కల్యాణ్ రామ్ నిర్మించారు.

‘జై లవ కుశ’ హిట్ అయింది. అంతకుమించి మూడు పాత్రల్లో తారక్ నటనకి ప్రశంసలు కురిసాయి. ఐతే, మరోసారి అన్నయ్య కల్యాణ్ రామ్ తో తారక్ సినిమా ఉండబోతుంది. దానికి త్రివిక్రమ్ దర్శకుడు కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడనున్నాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ బన్నీతో సినిమా చేస్తున్నారు. తారక్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత తారక్-కల్యాణ్-త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కనుందని చెబుతున్నారు.