క్లీన్‌స్వీప్‌ పై కోహ్లీసేన కన్ను


టీమ్‌ఇండియా ఆఖరి వన్డేలో నేడు వెస్టిండీస్‌ను ఢీకొంటుంది. సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని కోహ్లీసేన భావిస్తుంటే.. ఒక్క మ్యాచ్‌లోనైనా నెగ్గి పరువు దక్కించుకోవాలని ఆతిథ్య జట్టు ఆరాటపడుతోంది. సొంతగడ్డపై పేలవంగా ఆడుతున్న కరీబియన్‌ జట్టుకు కోహ్లీసేనను నిలువరించడం సవాలే. ఐతే, వరుసగా విఫలమవుతున్న ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ మాత్రం ఒత్తిడిలో ఉన్నాడు. ఫామ్‌తో తంటాలు పడుతున్నాడు. టీ20 సిరీస్‌లో వరుసగా 1, 23, 3 పరుగులు చేసిన ధావన్‌.. రెండో వన్డేలో 2 పరుగులకే ఔటయ్యాడు.

మరోవైపు నాలుగో స్థానం కోసం ఆసక్తికర పోరు నడుస్తోంది. ఆ స్థానం కోసం రిషబ్‌ పంత్‌తో శ్రేయస్‌ అయ్యర్‌ గట్టిగా పోటీపడుతున్నాడు. పంత్‌కు టీమ్‌మేనేజ్‌మెంట్‌ నుంచి, ముఖ్యంగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి నుంచి గట్టి మద్దతు ఉంది. కానీ అతడు విఫలమవుతుండడం, రెండో వన్డేలో శ్రేయస్‌ (68 బంతుల్లో 71) రాణించడంతో పరిస్థితి మారిపోయింది. బౌలింగ్‌లో భువనేశ్వర్‌ గత మ్యాచ్‌లో అద్భుతంగా రాణించాడు. 31 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు.