ఈసారి ప్రభాస్ మాట ఇవ్వకుండానే చేస్తాడట !


గతంలో ప్రభాస్ మాట ఇచ్చి తప్పాడు. గత ఆరేళ్ల కాలంలో ప్రభాస్ చేసినవి మూడే మూడు సినిమాలు. మూడో సినిమా ‘సాహో’ ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాహుబలి కోసం ఏకంగా నాలుగేళ్లు తీసుకొన్నాడు. ఈ సినిమా సమయంలో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. యేడాది రెండు సినిమాలు చేయాల్సిందేనని పట్టుబట్టారు. ప్రభాస్ కూడా ఇకపై యేడాది రెండు సినిమాలు చేస్తానని బాహుబలి2 ఫంక్షన్ లో మాటిచ్చాడు. కానీ, ఆ మాట తప్పాడు. సాహో కోసం రెండేళ్లు తీసుకొన్నాడు.

దీనిపై ఆదివారం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన సాహో ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ప్రభాస్ స్పందించారు. యేడాదికి కచ్చితంగా రెండు సినిమాలు చేస్తానని అభిమానులకి మాటిచ్చాను. కానీ, కుదరలేదు. సాహో ట్రైలర్ చూశారుగా.. భారీగా తెరకెక్కించాం. ఇలాంటి సినిమా చేస్తే టైం పడుతుంది. ఐతే, ఈసారి మాటివ్వను. మాటివ్వకుండానే యేడాదికి కచ్చితంగా రెండు సినిమాలు చేస్తానన్నారు ప్రభాస్. మాటిచ్చినప్పుడే నిలబెట్టుకోలేదు. మరీ.. మాట ఇవ్వకుండానే ప్రభాస్ అభిమానుల కోరిక తీరుస్తాడా.. ? చూద్దాం.. !

సుజీత్ దర్శకత్వంలో ‘సాహో’ తెరకెక్కింది. బాహుబలి తర్వాత టాలీవుడ్ నుంచి రాబోతున్న భారీ బడ్జెట్ సినిమా ఇది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సినిమా కూడా ఇదే. సాహో కోసం రూ. 350కోట్లు ఖర్చుపెట్టారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉండనుందని చెబుతున్నారు. ఈ నెల 30న సాహో ప్రేక్షకుల ముందుకు రానుంది.