బంగారం ధర ఆల్ టైం రికార్డ్

బంగారం ధర భగ భగ మండుతోంది. ఆల్ టైం రికార్డు స్థాయికి చేరింది. మంగళవారం నాటి బులియన్‌ ట్రేడింగ్‌లో 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.200 పెరిగి, రూ.38,770 వద్ద ఆల్‌టైం రికార్డు స్థాయి ధరను నమోదు చేసింది. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు ఉన్నా దేశీయంగా బంగారం ధర పెరుగుతుండటం గమనార్హం.

ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్‌ తగ్గకపోవడంతో పసిడి ధర అంతకంతకూ పెరుగుతోందని బులియన్‌ ట్రేడింగ్‌ వర్గాలు తెలిపాయి. రూపాయి బలహీన పడుతుండటం కూడా బంగారం ధర పెరగడానికి కారణమవుతోంది. ఈ వారం చివరిలో యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ జులై సమావేశ మినిట్స్‌, జాక్సన్‌ హోలీ ప్రసంగం ఉన్న నేపథ్యంలో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు.