నేడు చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్‌-2


గత నెల 22న శ్రీహరికోట రాకెట్‌ కేంద్రం నుంచి జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3ఎం1 ద్వారా చంద్రయాన్‌-2 ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం నేడు జరగనుంది. ఈ ఉదయం 9.30 గంటలకు చంద్రుని కక్ష్యలోకి చేరుకోనుంది. ఈ కక్ష్యలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడం అత్యంత కీలక ఘట్టం. ఈ ప్రక్రియలో ఉపగ్రహంలోని ద్రవ ఇంజిన్‌ను మండిస్తారు. ఇందు కోసం ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు.

ఇందుకోసం మొత్తం ఐదు విన్యాసాలు చేపట్టనున్నారు. మొదట శాస్త్రవేత్తలు రీఓరియంటేషన్‌ ప్రక్రియను చేపట్టనున్నారు. చంద్రయాన్‌-2 వేగాన్ని తగ్గించి దశ, దిశ మార్చడంతో చంద్రుని కక్ష్యలోకి చేరుకోనుంది. ఆ తర్వాత సెప్టెంబరు రెండో తేదీన ల్యాండర్‌పై రెండు విన్యాసాలు చేపట్టనున్నారు. ఫలితంగా ల్యాండర్‌ మృదువుగా ల్యాండింగ్‌ కానుంది. సెప్టెంబరు 7వ తేదీ వేకువజామున 1.30 నుంచి 2.30 గంటల మధ్యలో సాఫీగా ల్యాండింగ్‌ చేయనుంది. ఆర్బిటర్‌, ల్యాండర్‌లో ఏర్పాటు చేసిన కెమెరాలు ల్యాండింగ్‌ ప్రాంతాన్ని రియల్‌ టైమ్‌లో చిత్రాలను తీసి పంపనున్నాయి. ల్యాండర్‌ కింద ఉండే కెమెరాలు ల్యాండింగ్‌ స్థలాన్ని అధ్యయనం చేసి అక్కడ ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉంటే ల్యాండ్‌ చేస్తాయి. ల్యాండర్‌ దిగిన తర్వాత అందులోని ఆరుచక్రాల రోవర్‌ దాదాపు నాలుగు గంటల తర్వాత బయటకు వస్తుంది. ఇది సెకనుకు సెంటీమీటరు వేగంతో పయనిస్తుంది. 14 రోజుల్లో 500 మీటర్ల దూరం చంద్రునిపై పయనించనుంది. అది అక్కడ తీసిన డేటా మొత్తాన్ని ల్యాండర్‌ ద్వారా 15 నిమిషాల్లో భూమిపై చేరవేయనుంది.