గోదావరి జిల్లాలో ఇంటిని హైదరాబాద్’లో కట్టారు

ఇది నిజం. హైదరాబాద్ లో అద్భుతమైన ఓ ఇంటిని రెడీ చేశారు. దాన్ని సినిమాలో మాత్రం గోదావరి జిల్లాలో వున్నట్లు ప్రొజెక్ట్ చేస్తారు. సాయిధరమ్ తేజ్ ‘ప్రతిరోజూ పండగే’ సినిమా కోసం నానక్ రామ్ గుడా స్టూడియోలో వున్న ఓ ఇంటిని తీసుకుని ఆర్ట్ డైరక్టర్ రవీందర్ మేకోవర్ చేసారు. చాలాకాలంగా సాదా సీదాగా వున్న ఆ ఇంటి లుక్ నే మార్చేసారు. ఇప్పుడు కేవలం ఈ ఇంటిని చూసేందుకే కొంతమంది ఇండస్ట్రీ జనాలు రావడం విశేషం. సినిమాలో హీరో తాతగా నటిస్తున్న సత్యరాజ్ పాత్ర కోసం ఈ ఇంటిని రెడీ చేశారు. అది అల్ట్రా మోడరన్ ఇల్లు కాదు. పాత-కొత్తల మేలు కలయికగా వుండే ఇల్లు. చూడ్డానికి చాలా బాగుంది.

వరుస ప్లాపులతో సతమతమైన సాయిధరమ్ తేజ్ చిత్రలహరి సినిమాతో తిరిగి హిట్ ట్రాక్ లోకి వచ్చాడు. మరోసారి పాతదారిలోకి వెళ్లి… మాస్, యాక్షన్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకులకి బోర్ కొట్టించకుండా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని ఎంచుకొన్నాడు. ‘ప్రతిరోజు పండగ రోజే’ టైటిల్ కి తగ్గట్టుగా సినిమాని సరదాగా ఉంటుందట. ఈ కథని మెగాస్టార్ చిరంజీవి ఓకే చేయడం విశేషం. దర్శకుడు మారుతి ఈ చిత్రానికి కేర్ తీసుకొని మరీ చేస్తున్నాడట. ఈ చిత్రానికి ధమన్ సంగీతం అందిస్తున్నారు.రాశీఖన్నా కథానాయిక. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది.