కారు ప్రమాదంపై స్పందించిన రాజ్ తరుణ్


మంగళవారం ఉదయం నార్సింగిలోని ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో అల్కాపురం వద్ద కారు ప్రమాదం జరిగింది. ఐతే, అది హీరో తరుణ్ కారు, ఆయన ప్రమాదం నుంచి క్షేమంగానే బయటపడ్డారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత అది తరుణ్ కాదు.. రాజ్ తరుణ్ కారు అని క్లారిటీ వచ్చింది. ఐతే, ఈ ప్రమాదంపై మంగళవారం రాజ్ తరుణ్ నోరు తెరవలేదు. ప్రమాదం జరిగిన చోటే కారుని వదిలేసి పారిపోయాడు. ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్ కారు ప్రమాదంపై రకరకాల అనుమానాలు తలెత్తాయ్.

కారు ప్రమాదం ఈ ఉదయం రాజ్ తరుణ్ ట్విట్టర్ వేదిక స్పందించారు. ప్రమాదం జరిగిన తీరుని వివరించారు. “నార్సింగి సర్కిల్ లో ఒక్కసారిగా కుడివైపు టర్న్ తీసుకోవాల్సి వచ్చింది. దీంతో నేను కారుపై నియంత్రణ కోల్పోయాను. కారు ఒక్కసారిగా వెళ్లి పక్కనే ఉన్న గోడను బలంగా ఢీకొట్టింది. అప్పుడు వచ్చిన శబ్ధానికి నా రెండు చెవులు పనిచేయలేదు. చూపు కూడా సరిగ్గా కనిపించలేదు. గుండె దడ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ ఘటన జరిగినప్పుడు నేను సీట్ బెల్ట్ పెట్టుకునే ఉన్నాను. నాకు దెబ్బలేమీ తగలలేదని నిర్ధారించుకున్నాక కారు నుంచి బయటపడ్డాను. ఆ ఆందోళనలో ఇంటికి పరుగెత్తుకుంటూ వెళ్లాను” అని తెలిపారు.

నార్సింగి సర్కిల్ లో గత 3 నెలలుగా చాలా ప్రమాదాలు జరిగాయని రాజ్ తరుణ్ గుర్తుచేశాడు. తన యోగక్షేమాలు తెలుసుకోవడానికి చాలామంది కాల్స్ చేస్తున్నారనీ, ఇంత మంది ప్రేమను పొందినందుకు తాను అదృష్టవంతుడిని. సీటు బెల్టే ప్రమాదం నుంచి తనను కాపాడిందనీ, సీట్ బెల్ట్ ధరించాలని సూచించాడు రాజ్ తరుణ్.