తెలంగాణ బీజేపీ టార్గెట్ @2023


బీజేపీ తెలంగాణపై ఫోకస్ చేసింది. తెలంగాణ సీఎం కేసీఆర్ పాలన అవినీతిమయం, కుటుంబ పాలన అంటూ భాజాపా జాతీయ, ప్రాంతీయ నేతలు ఆరోపిస్తున్నాయ్. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ టార్గెట్ తెరాస ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా మారడం. త్వరలో రాబోతున్న మున్సిపల్ ఎన్నికలు అనే ప్రచారం జరుగుతోంది. ఐతే, తమ పార్టీ లక్ష్యం మున్సిపల్‌ ఎన్నికలు కాదని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి స్పష్టంచేశారు. 2023లో తెలంగాణలో అధికారంలోకి రావడమే భాజపా లక్ష్యమన్నారు.

బుధవారం హైదరాబాద్‌లో సనత్‌నగర్‌ ఈఎస్‌ఐసీలో రూ.150 కోట్లతో కొత్త బ్లాక్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా కిషన్‌ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని అమలు చేయాలని ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆరోగ్యశ్రీ మంచి కార్యక్రమం అయితే ధర్నాలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ఎవరో తెలియదనడం మంచి సంస్కృతి కాదన్నారు. ఆయనెవరో తెలియనప్పడు గతంలో కేటీఆర్‌ నడ్డాను ఎలా కలిశారని నిలదీశారు. రాష్ట్రంలో భాజపా లేకపోతే కవిత ఎలా ఓడిపోయారు ? అని కిషన్‌ రెడ్డి ప్రశ్నించారు.

ఇక, ఏపీ రాజధాని అమరావతి మార్పుపై కిషన్ రెడ్డి స్పందించారు. ఏపీ రాజధాని మార్పుపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోదని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశం కేంద్రం పరిధిలోకి రాదని పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్‌ దేశానికి రెండో రాజధాని అంటూ వస్తున్న వార్తల్లో కూడా వాస్తవం లేదన్నారు.