జెమినీ టీవీలో ‘అల.. వైకుంఠపురంలో’ !

త్రివిక్రమ్ సినిమాలకి బుల్లితెరపై మంచి గిరాకీ. ఆయన ప్లాప్ సినిమాలని సైతం బ్లాక్ బస్టర్ సినిమాల్లా చేసేస్తారు టీవీ ప్రేక్షకులు. ఫ్యామిలీతో కలిసి హాయిగా చూసేలా త్రివిక్రమ్ సినిమాలు ఉండటం ఇందుకు ఓ కారణమని చెప్పవచ్చు. అందుకే త్రివిక్రమ్ సినిమా ప్రకటన రాగానే శాటిలైట్ రైట్స్ దక్కించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తుంటాయి ప్రముఖ టీవీ ఛానెల్స్.

త్రివిక్రమ్ తాజా చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’. బన్నీ-త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న హ్యాట్రిక్ చిత్రమిది. పూజా హెగ్డే కథానాయిక.
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. యంగ్ హీరోలు నవదీప్, సుశాంత్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం జెడ్ స్పీడుతో షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని జెమినీ టీవీ సొంతం చేసుకొంది. ఈ విషయాన్ని జెమినీ యాజమాన్యం అధికార ట్విట్టర్ ద్వారా తెలిపింది. “స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు పూజా హెగ్డే నటించిన రాబోయే చిత్రం అల వైకుంఠపురం లో యొక్క శాటిలైట్ హక్కులను జెమిని టివి సంపాదించింది” అని ట్విట్ చేశారు. ఐతే, ఇందుకోసం ఎంత చెల్లించారు అనేది మాత్రం చెప్పలేదు. ఇండస్ట్రీ వర్గాల సమాచారమ్ ప్రకారం.. అల.. వైకుంఠపురం శాటిలైట్స్ కు భారీ రేటు పలికినట్టు సమాచారమ్.