ఈటెలని టార్గెట్ చేసిన కేటీఆర్ ?


తెరాసలో మంత్రి ఈటెల వ్యవహారం ముదురుతున్నట్టు కనబడుతోంది. ఈటెలకి రెండో దఫా మంత్రి పదవి ఇవ్వడం సీఎం కేసీఆర్ కి ఇష్టంలేదు. కానీ తప్పని పరిస్థితుల్లో ఈటెలకి మరోసారి మంత్రి పదవి ఇచ్చారు. ఇక త్వరలోనే జరగనున్న మంత్రివర్గ విస్తరణలో ఈటెలకి చెక్ పడనుందనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటెల హుజూరాబాద్ సభలో మాట్లాడిన ఈటెల.. పార్టీకి ఓనర్లం తామేనని, తనకు మంత్రి పదవి ఎవరి బిక్షా కాదని గట్టిగానే మాట్లాడారు.

ఇక తాజా పరిణామాలపై మంగళవారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవులు రాగానే కొందరు నేతలు పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. పదవులు వచ్చింది పార్టీ వల్లనేనని, ప్రజలే బాసులనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఐతే, ఈ వ్యాఖ్యలు కేటీఆర్ మంత్రి ఈటలను లక్ష్యంగా చేసుకొని చేశారనే కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. అదే నిజమైతే.. తెరాసలో టార్గెట్ ఈటెల నిజమేనని భావించాల్సి ఉంటుందేమో.. !