వినాయక నిమజ్జనంలో అపశృతి


హైదరాబాద్ కిషన్‌బాగ్‌లో వినాయక నిమజ్జనోత్సవంలో అపశృతి జరిగింది. నిమజ్జనం విధుల్లో ఉన్న పోలీస్‌ కానిస్టేబుల్‌ మీద ప్రమాదవశాత్తు క్రేన్‌ పడింది. దీంతో కానిస్టేబుల్‌ రవీందర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. రవీందర్‌ను వెంటనే నాంపల్లి కేర్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రవీందర్‌ బహదూర్‌పురా పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు.

ఇక నగరంలో వినాయక నిమజ్జనోత్సవంలో ఘనంగా జరుగుతోంది. కొద్దిసేపటి క్రితమే ఖైరతాబాద్‌ మహా గణేశుడి నిమజ్జనం పూర్తయింది. ఖైరతాబాద్‌ నుంచి ప్రారంభమైన మహాగణపతి శోభయాత్ర తెలుగుతల్లి ఫ్లైఓవర్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌ల మీదుగా ట్యాంక్‌బండ్‌ వరకు సాగింది. ట్యాంక్‌బండ్‌ వద్ద మహాగణపతికి పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన ప్రత్యేక క్రేన్‌ నంబరు-6 వద్ద 50 టన్నుల బరువున్న లంబోధరుడిని హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేశారు.