ఈ నెల 19 వరకు దసరా సెలవులు పొడగింపు


తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవులని మరో వారం రోజుల పాటు పొడగించింది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఈ నెల 19 వరకు విద్యాసంస్థలకు సెలవులను పొడిగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఐతే, విద్యార్థులు సిలబస్‌ నష్టపోకుండా రెండో శనివారం స్కూళ్లు నడపాలని ఆదేశించారు.

మరోవైపు, ఆర్టీసీ కార్మికులు సమ్మెని మరింత ఉదృతం చేసే దిశగా కార్యచరణ ప్రకటించారు. ఈనెల 13న రాష్ట్ర వ్యాప్తంగా వంటావార్పు,  14న అన్ని డిపోల ఎదుట బైఠాయింపు, బహిరంగసభలు, 15న రాస్తారోకోలు, మానవహారాలు, 16న ఐకాసకు మద్దతుగా విద్యార్థుల ర్యాలీలు,  17న ధూంధాం కార్యక్రమాలు, 18న ద్విచక్రవాహన ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇక ఈ నెల 19న తెలంగాణ బంద్ ని పాటించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 15న ఆర్టీసీ సమ్మెపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఆ తర్వాతే ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు ఏంటన్నది తెలియనుంది.