భారత్’లో ఫస్ట్ 5జీ వీడియో 


భారత్ లో తొలిసారి 5జీ వీడియో ప్లే అయింది. ‘ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ 2019’ వేదికగా స్వీడన్‌కు చెందిన టెలికం కంపెనీ ఎరిక్సన్‌ 5జీ లైవ్‌ వీడియో కాల్‌ను తొలిసారిగా భారత్‌లో ప్రదర్శించింది. క్వాల్‌కామ్‌ భాగస్వామ్యంతో దీనిని ప్రదర్శిస్తున్నామని ఎరిక్సన్‌ హెడ్‌ నున్‌జో మిర్టిల్లో తెలిపారు. 5జీ సర్వీస్‌లు మిల్లీమీటర్‌వేవ్‌ స్పెక్ట్రమ్‌ ద్వారా అందుతాయని వివరించారు.

వచ్చే ఏడాది నుంచి 5జీ టెక్నాలజీని సపోర్ట్‌ చేసే స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు పెరగనున్నాయని క్వాల్‌కామ్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ రాజెన్‌ వగాడియా పేర్కొన్నారు. 5జీ కారణంగా భారత్‌లో కొత్త అవకాశాలు అందివస్తాయని వివరించారు. కాగా, 5జీ సర్వీసులకు సంబంధించిన స్పెక్ట్రమ్‌ను ఈ ఆర్థిక సంవత్సరంలోనే వేలం వేయనున్నామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. 

ఇక 5జీ సర్వీసులు ఇప్పటికే అమెరికా, దక్షిణ కొరియాల్లో లభిస్తున్నాయి.