టాలీవుడ్ ‘రాజు’ ఒక్కరే !


మహాత్మగాంధీ 150వ జయంతి సందర్భంగా ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన విందు సమావేశానికి దక్షిణాది సినీ పరిశ్రమకి ఆహ్వానం అందకపోవడంపై విమర్శలు వెలువెత్తుతున్న సంగతి తెలిసిందే. దీనిపై మెగాస్టార్ కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన ట్విట్టర్ వేదికగా ప్రధాని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఆమెకి నెటిజన్స్, సినీ ప్రముఖుల నుంచి సపోర్ట్ లభిస్తోంది.

ఇదిలావుంటే.. ప్రధాని విందుకు టాలీవుడ్ నుంచి ముగ్గురికి ఆహ్వానాలు అందాయి. వారు సమావేశానికి హాజరయ్యారు కూడా. నిర్మాత దిల్ రాజు, గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, మీడియా టైకూన్ రామోజీ తనయుడు కిరణ్ కు మాత్రమే ఆహ్వానాలు అందాయి. తాజాగా దిల్ రాజు ప్రధాని మోడీతో దిగిన ఫోటోని తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.

‘మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన `ఛేంజ్ విత్ ఇన్` కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీగారిని కలవడాన్ని చాలా గొప్ప గౌరవంగా భావిస్తున్నా. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు విషయాల గురించి మాట్లాడుకున్నాం’ అని దిల్ రాజు రాసుకొచ్చారు. ప్రధానితో దిల్ రాజు ఫోటో చూసిన నెటిజన్స్.. టాలీవుడ్ రాజు ఒక్కరే అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.