హుజూర్ నగర్ ఉపఎన్నిక : చింతబండలో ఈవీఎం మొరాయింపు

హుజూర్ నగర్ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం నుంచి 9గంటల వరకు 13.44 శాతం పోలింగ్ నమోదైంది. ఐతే, ఒకట్రెండు చోట్ల ఈవీఎం మొరాయించినట్టు తెలుస్తోంది. నేరెడుచర్ల మండలం చింతబండలో మాత్రం ఈవీఎం మొరాయించడంతో పోలింగ్‌ను నిలిపివేశారు.

హుజూర్ నగర్ ఉప ఎన్నిక బరిలో  ముగ్గురు మహిళా అభ్యర్థులతో సహా మొత్తం 28 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో 2,36,842 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 1,20,427 మంది మహిళలు, 1,16,415 మంది పురుష ఓటర్లు ఉన్నారు. ఇక పోలింగ్ కోసం మొత్తం 302 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1500 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.