జగన్ సంచలన నిర్ణయం.. అలీకి స్పీకర్ పదవి !?

టాలీవుడ్ టాప్ కమెడియన్ అలీ వైసీపీలో ఉన్న సంగతి తెలిసిందే. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఏ పార్టీలో చేరాలన్న అంశంపై అలీ తర్జనభర్జన పడ్డారు. చివరికి వైసీపీలో చేరారు. కానీ ఆయనకి ఎమ్మెల్యే టికెట్ దొరకలేదు. అయినా.. అసంతృప్తి చెందకుండా పార్టీ కోసం కష్టపడ్డారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వైసీపీ గెలుపులో తన వంతుగా ఉడత సాయం చేశారు. ఇప్పుడు దానికి ఫలితం దక్కింది. అలీకి స్పీకర్ పదవి వచ్చింది. ఐతే, అది సీఎం జగన్ ఇవ్వలేదు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇచ్చారు. 

వర్మ తాజా చిత్రం ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత చోటు చేసుకొన్న పరిణామల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతున్నట్టు ట్రైలర్ ని చూస్తే అర్థమయింది. ఇందులో వర్మ మరోసారి తెదేపా అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు చినబాబు లోకేష్ ని టార్గెట్ చేసినట్టు కనిపించింది. సీఎం జగన్ లోని మరో కోణాన్ని కూడా ఆవిష్కరించినట్టు అర్థమవుతోంది.

ఇక ఈ సినిమాలో అలీ ఏపీ శాసన సభ స్పీకర్ గా కనిపించబోతున్నారు. సోమవారం అలీ స్పీకర్ లుక్ ని వర్మ విడుదల చేశారు. స్పీకర్ చైర్ లో అలీ నిద్రస్తున్న పోస్టర్ ని వర్మ వదిలారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ పాత్రలో అలీ కనిపించబోతున్నాడు అన్నమాట. ఫస్ట్ లుక్ తోనే తమ్మినేనిపై వర్మ సటైర్ వేసినట్టయింది.