ఐక్యతా విగ్రహం భారత సమగ్రతకు చిహ్నం : మోడీ  


దేశవ్యాప్తంగా నేడు ఐక్యతా దివస్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సర్థార్ వల్లభాయ్ పటేల్ జయంతి అక్టోబర్‌ 31ని ఐక్యతా దినోత్సవంగా మోడీ 2014లో ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ కేంద్ర మంత్రులు అమిత్‌ షా, హర్‌దీప్‌ సింగ్‌ పురి, దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజర్‌తో కలిసి ఢిల్లీలోని పటేల్‌ చౌక్‌ వద్ద సర్దార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమిత్‌ షా ‘ఐక్యతా పరుగు’ను జెండా ఊపి ప్రారంభించారు. అధికరణ 370, 35ఏ రద్దుతో జమ్మూకశ్మీర్‌ను భారత్‌లో పూర్తి స్థాయిలో అంతర్భాగం చేయాలన్న పటేల్‌ కల నేరవేరిందన్నారు అమిత్ షా.

మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని ఐక్యతా విగ్రహం వద్ద పటేల్‌కు నివాళులర్పించారు. అనంతరం ఏక్‌తా దివస్‌ పరేడ్‌లో పాల్గొన్నారు.  భారత సమగ్రతకు సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహం చిహ్నమని ప్రధాని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం దేశానికే గర్వకారణం. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఐక్యత కోసం పాటుపడుతున్నారన్నారు. మనల్ని విడగొట్టేందుకు శత్రువులు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. భారతీయులను ఎవరూ విడదీయలేరన్నారు.