మరోసారి పంత్ ని టార్గెట్‌ చేశారు

యువకీపర్‌ రిషభ్‌పంత్‌ ని మహేంద్ర సింగ్ ధోని వారసుడిగా భావించారు. అందుకే పంత్ కి కావాల్సినన్నీ అవకాశాలు ఇచ్చారు. కానీ, ఆ అవకాశాలని పంత్ సద్వినియోగం చేసుకోలేదు. వరల్డ్ కప్ లోనూ, తరువాత కూడా పంత వైఫల్యం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో పంత్ కి ప్రత్యామ్నాయాలు వెతుకుతోంది బీసీసీ. సంజు శాంసన్, భరత్ తదితరులకి అవకాశాలు ఇచ్చి చూస్తోంది.

ఇలాంటి సమయంలో పంత్ కి దొరికిన అద్భుతమైన అవకాశం బంగ్లాదేష్ తో టీ20 సిరీస్. ఆదివారం ఢిల్లీ వేదికగా బంగ్లాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా ఘోరంగా ఓటమి పాలైంది. ఈ ఓటమికి పంత్ ప్రధాన కారణమని నెటిజన్స్ మండిపడుతున్నారు. బ్యాటింగ్ సంగతి పక్కనపెడితే కీపింగ్ తప్పిదాలు చేశాడు పంత్. చాహల్‌ వేసిన 10వ ఓవర్‌లో సౌమ్యసర్కార్‌(20) పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఆ సమయంలో ఓ బంతి సౌమ్య బ్యాట్‌కు తాకీతాకనట్టు వెళ్లి నేరుగా పంత్‌ చేతుల్లో పడింది. దీనిపై పంత్ డీఆర్‌ఎస్‌ పట్టుబట్టాడు. కానీ సమీక్షలో సౌమ్యసర్కార్‌ అవుట్ కాలేదని తేలింది. ఆ సమయంలో కెప్టెన్‌ రోహిత్‌శర్మ.. పంత్‌ వైపు చూసి నవ్వుకున్నాడు. ఆ సన్నివేశం చూడటానికి చాలా హాస్యాస్పదంగా ఉంది. దీంతో పంత్ ని నెటిజన్స్ ఓ రేంజ్ లో టార్గెట్ చేస్తున్నారు.